Wednesday, October 8, 2014

navaneeta balakrishna (part 2)


నవనీత బాలకృష్ణ (part 2)

21-9-2014

వెన్నముద్ద కృష్ణుడిని మరోసారి చూడాలనే కోరిక, చారిత్రక కట్టడాలు చూడాలనే సహజమయిన ఆసక్తి తో , ఆ రోజు చూడలేకపోయిన శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుడిని చూడాలని మరోసారి కొండవీడు బయలుదేరాం .  ఆ రోజు కుంభవృష్టి గా వానపడుతుంటే  .. ఈ రోజు ఎండ చుర్రుమంటోంది .. విజయవాడ వాతావరణం అంటే ఇలాగే వుండాలి మరి!!

ఆలయ పూజారి శ్రీ పరుచూరి సత్యనారాయనాచారి గారికి ఫోన్ చేస్తే.. ప్రస్తుతం పూజలు జరుగుతున్న ఆలయ చరిత్ర గురించి టూకీగా చెప్పారు.  ఆలయ చరిత్ర ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...:

శ్రీకృష్ణదేవరాయలు తన విజయ పరంపరలో భాగంగా తను సాధించిన విజయానికి గుర్తుగా కొండవీడు లో విజయ స్థూపాన్ని నిర్మించారు.  తన వంశాభివృద్ధి కోసం అక్కడే వెన్నముద్ద కృష్ణుడి ని ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించారు.  కొంతకాలానికి మహమ్మదీయుల దండయాత్రలో.. ఆలయాలను ధ్వంసం చేస్తుంటే  వారి బారినుంచి కృష్ణుడి మూలవిరాట్ ని రక్షించటానికి  విగ్రహాన్నిఅక్కడి రైతులు  ఒక పొలం లో దాచిపెట్టి పైన ఆకులు అలములతో కప్పేసారుట. అలా చాలా కాలమయిన తర్వాత చిలకలూరిపేట జమిందారు  గారు.. శ్రీ రావుబహద్దూర్ రాజామానూరి వెంకట కృష్ణ రావు గారు తమ జాగిర్దారులో భాగమయిన ఈ ప్రాంతం లో పొలం దున్నిస్తుంటే విగ్రహం బయటపడిందట . దానిని తన వూరు చిలకలూరిపేట కు తీసుకు వెళ్లి అక్కడ ఆలయం కట్టాలనుకున్నారుట .  విగ్రహాన్ని బండి లో పెట్టి దాదాపు 2km దూరం (అంటే ఇప్పుడు ఆలయం వున్న చోటు ) రాగానే ఒకచోట బండి ఆగిపోయిందిట . వేరే బండిలో విగ్రహాన్ని తీసుకు వెళ్లాలనుకున్నా ఆ బండి కూడా విరిగిపోయిందిట .  ఇలా ఎన్ని బండ్లు ప్రయత్నించినా లాభం లేకపోయిందిట .  సరే అని ఆ రాత్రికి అక్కడే విశ్రమించారుట .  ఆ రాత్రి ఆయనకి  స్వప్నం లో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి , తాను ఇక్కడే ఉంటాననీ , ఇక్కడే  తనకి గుడి కట్టించమని చెప్పారుట .  అలా ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందిట .  అప్పటినుంచీ తామే వంశపారంపర్యంగా పూజారులుగా ఉన్నామని ప్రస్తుత పూజారి శ్రీ సత్యనారాయణాచార్ చెప్పారు . ఆలయ చరిత్ర గురించి పుస్తకం ముద్రిస్తున్నట్టు చెప్పారు.  ప్రస్తుతం ఆలయాన్ని ISKON వాళ్ళు అధీనం చేసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.




 .  .
మళ్ళీ మా ప్రయాణం లోకి .. 

గుడి లో కృష్ణుడిని దర్శించుకుని, స్తోత్రాలతో ముద్దులాడి, కృష్ణదేవరాయలవారు కట్టించిన గుడి కి బయలుదేరాం.  సుమారు 2km ప్రయాణం తర్వాత దూరం గా కనిపించింది గుడి.  పంట పొలాల మధ్యలో దూరం నుంచీ ఎంతో అందంగా ఉంది.  'వాచ్ మాన్' కం గైడ్ మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు .  ఏదేదో చెప్తున్నాడు కానీ ఏమీ అర్ధం కాలేదు .  సరే .. ముందుగా రాయలవారి విజయస్థూపం కనిపించింది . గుడి కి ఎదురుగా వుంది అది .  22 అడుగుల ఏకరాతి స్థూపం .  దాని మీద ఏదో శాసనం కూడా చెక్కి వుంది .  తెలుగు లిపి లానే వుంది . 



అక్కడి నుంచీ గుడి ప్రాంగణం లోకి నడిచాం .  లోపల ముందుగా తల నరికివేయబడిన నంది విగ్రహం కనిపించింది .  విష్ణాలయం లో నంది ఉంది ఏంటబ్బా అని ఆశ్చర్యం అనిపించింది .  ప్చ్ .. ఆ కథ ఏంటో మరి !!?? చాలా విశాలమయిన గుడి .... లోపల మండపం కూడా పెద్దదిగా వుంది .  పారాడే కృష్ణుడు, చేప , ఇంకా కొన్ని మూర్తులు చెక్కి వున్నాయి గుడి గోడల మీద.  ఒకచోట ఏదో శాసనం కూడా వుంది తెలుగు లిపి లోనే .  కానీ స్పష్టం గా లెదు.  గర్భగుడి చీకటి మయం .  అసలు ఏమాత్రం వెలుతురు లేదు .  పైగా భరించలేని దుర్గంధం .  ఒక్క నిమిషం కూడా వుండలేకపోయాం లొపల.  ఒకప్పుడు ఈ గుడి లోకృష్ణుడికి  వైభవంగా పూజలు జరిగేవి అని ఊహించుకుంటే ఎంతో అద్భుతంగా ... ఇప్పటి స్థితి ని చూసి అంతకంటే బాధగా అనిపించింది .  ఏ  చారిత్రిక   కట్టడం చూసినా ... అది గుడి అయినా కావచ్చు ,  కోట అయినా కావచ్చు , ఇంకేదయినా కావచ్చు ... ఏదో తెలీని సంతోషం ,ఆశ్చర్యం ,  ఉద్వేగం, విషాదం అన్ని భావాలూ ఒకేసారి వస్తాయి ఎందుకో .!!  










గుడి కి ఎదురుగా వున్న కొండమీద కోట కనిపిస్తోంది .  అదే కొండవీటి కోట ట.  అక్కడ సినిమా షూటింగులు కూడా జరిగాయని చాలా ఉత్సాహంగా చెప్పాడు watchman కం గైడ్ !! ఎక్కాలనిపించింది కానీ దానికి తగ్గ preparation తో రాలేదు .  



అన్నట్టు ఇంతకీ  కత్తుల బావి అంటే ఏంటో ... దాని చరిత్ర ఏంటో తెలీలేదు .   పూజారి గారిని అడిగితే  'అది అంతా వేరే చరిత్ర లేమ్మా !'  అన్నారు అంతే .. ఇంకేం చెప్పలేదు .  ఇక్కడ మా 'గైడ్' మాత్రం గుడిలో గర్భగుడి ముందు ప్రదేశం చూపించి ఇదే కత్తుల బావి .. ఇప్పుడు పూడ్చేశారు  .. అన్నాడు . ఇంకా ఏంటో చెప్పాడు .. రెడ్డిరాజులు .. అంటూ ఏదేదో చెప్పాడు ... ఒక్క ముక్క అర్ధం కాలేదు . గర్భగుడి ముందు బావి ఏమిటో  ... అందులో కత్తులు ఏమిటో  .. ఆ కథ ఏమిటో మరి !!!

ఇంక మళ్ళీ తిరిగి వెళ్ళే సమయమయింది .  దారిలో వెన్నదొంగ కి బయటినుంచే నమస్కారం చేసి .. ఇంటి దారి పట్టాము !!

Tuesday, October 7, 2014

నవనీత బాలకృష్ణ

నవనీత బాలకృష్ణ (part 1)



18-9-2014

పొద్దున్న సమయం 5.45 అయింది .. కాఫీ కప్ పట్టుకుని బయటికి వచ్ఛాను . చిన్న వర్షం జల్లు పడుతోంది . ఆకాశం మందపాటి కంబళి కప్పుకున్నట్టుగా వుంది దట్టమయిన మేఘాలతో .. విజయవాడ వాతావరణానికి భిన్నంగా చల్లగా, ఆహ్లాదంగా ఉంది . అబ్బొ.. పెద్ద వర్షమే వచేట్టుందే అనుకున్నా.. 

మా పూర్వీకులు, అంటే, నాకూ , శ్రీవారికీ కూడా   తాతగారి తాతగారు అయిన, చిలకలూరిపేట జామిందారులు 
శ్రీ రాజబహద్దూర్ రాజామానూరి కృష్ణా రావు గారు గుంటూరు జిల్లా , కొండవీడు లో (విజయవాడ నుంచీ సుమారుగా 50km )  కట్టిన గుడి నవనీత బాలకృష్నుడి  గుడిని చూద్దామని నేనూ శ్రీవారు బయలుదేరాము. 
సరిగ్గా 6 గంటలకి బయలుదేరాము .  హైవే మీదకు వచ్చేసరికి చిన్నజల్లు కుండపోత గా మారింది .  స్నేహితులు  చెప్పిన గుర్తుల ప్రకారం దారి వెతుక్కుంటూ వెళ్తున్నాము .  హైవే దిగిన తర్వాత సన్నని దారి ...దారికి అటూ ఇటూ ఒకవైపు పంటపొలాలు , ఒకవైపు కొండలు , చేట్టుచేమలు చిట్టడవిలా ఉంది  పైన భోరున వర్షం .. అద్భుతంగా వుంది ప్రకృతి .. 

చివరికి అలా అలా మొత్తానికి గుడిని చేరాము . కారు దిగి గుడిలోపలికి వెళ్ళేలోపే మొత్తం తడిసిపోయాము .  కృష్ణుడే సహజ సిద్ధమయిన నీటితో మమ్మల్ని  శుద్ధి చేసినట్టు అనిపించింది .  మా ముత్తాతగారు కట్టించిన గుడి కి వచ్చాము అనుకునేసరికి చాలా ఆనందంగా , గర్వంతో ఒళ్ళు పులకరించింది . 

ఇంకా గర్భగుడి తలుపు తీయలేదు .  కరెంటు లేదు . కానీ invertor వుందని చెప్పాడు కుర్ర పూజారి !  మమ్మల్ని కూర్చోమని అతను లోపలికి వెళ్లి నిర్మాల్యమ్ తీయటం .అవన్నీ కానిచ్చి , అలంకరణ చేసి  తెర తీసాడు!! 
ఒహ్..  ఎదురుగా ముద్దులొలికె పసిబాలుడి మోహన రూపం లో వెన్నముద్ద కృష్ణుడు !! అత్యద్భుతమయిన ఆ రూపం చూసి విభ్రాంతి తో తనువు , మనసు కంపించింది .  ఒక చేతిలో వెన్నముద్ద, ఒక చెయ్యి వెన్న చట్టి మీద, కుడికాలు ముందుకి మడిచి, ఎడమకాలు వెనక్కి వుండి ..పారాడుతున్న భంగిమలో దాదాపు రెండడుగులు ఎత్తులో ఉన్న బాల కృష్ణుడిని అలా చూస్తూనె వుండిపోవాలనిపించింది .  దోగాడుతున్న రూపం లో వున్న ఇలాంటి విగ్రహం ప్రపంచం లో ఇంకెక్కడా లేదుట . అలాగే , స్వామివారి మెడలో పులిగోరు పతకం, ఉంగరాల జుట్టు, భుజాల మీద శంఖు చక్రాలతో వున్న రూపం మరెక్కడా లేదుట !! గర్భాలయానికి అటూ ఇటూ రాజ్యలక్ష్మి అమ్మవారు, వేణుగోపాల స్వామీ వున్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాతా స్వామివారి సుందర రూపాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుంటూ తిరుగుప్రయాణం అవుతూ ఆలయ చరిత్ర చెప్పమని అడిగాం పూజారిని . తనకి అంత బాగా తెలీదు , వాళ్ళ నాన్నగారిని అడగమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు . అక్కడికి ఇంకో 2km  దూరం లో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుడి, కత్తుల బావి వుంటాయి ..కానీ ఈ వర్షం లో వెళ్ళలేరు ..ప్రమాదమ్ అని చెప్పాడు ... చిన్న పూజారి . పునర్దర్శన  ప్రాప్తి రస్థు  అని దీవించి పంపించాడు . అతని దీవెన వూరికే పోతుందా!!! కృష్ణుడు మళ్ళీ రప్పించుకున్నాడు  తన దగ్గరికి.. ఆదివారం నాడు !!

        

తిరుగుప్రయాణం మర్చిపోలేని .. ఉద్వేగభరిత అనుభవాన్ని ఇచ్చింది !! కుండపోతగా కురుస్తున్న వర్షానికి , కొండల మీదనుండి పడే వర్షం నీరు జలపాతాలని తలపించింది .  కింద పొలాలూ , వాగులూ, పంట కాలువలూ అన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.  దారిలో రెండు అనుకుంటా causeway లు వున్నాయి. ఒకటి ఎలాగో ధైర్యం చేసి దాటేసాం .  రెండోది మాత్రం కొంచెం భయపెట్టే రీతి లో ప్రవహిస్తోంది . దాటటం రిస్క్ అనిపించింది .  దాదాపు 45 నిమిషాలు అలాగే కూర్చున్నామ్ .  చుట్టూ ఎటు చూసినా కొండలు , పొలాలు , చిట్టడవి .. కనుల విందుగా ఆకుపచ్చని ప్రకృతి . పైనుంచి హోరు మని శబ్దం తో వాన ,  కింద ఉరుకులతో గలగలా ప్రవహిస్తున్న వాగులు ... అయినా... ఆ శబ్దం లోనే అందమయిన నిశ్శబ్దం !! ప్రకృతి జోల పాడుతున్నట్టుగా వుంది!! హ్మ్మ్ ...కానీ అలా ఎంతో సేపు ఉండలేము కదా!! చివరికి మన చోటికి చేరుకోక తప్పదు !! మధ్యలో రెండు మోటార్ సైకిల్ వాళ్ళు కొట్టుకు పోయినంత పని అయింది ..ఎవరొ కార్ నీటి మధ్యలో ఆగిపోయింది .  ఇంకా వుంటే ప్రవాహం ఇంకా ఎక్కువయ్యేలా వుందనిపించి డ్రైవర్ కార్ ని ధైర్యం చేసి నీటిలో ఉరికించాడు !! అంతా కృష్ణ లీల.. ఆయన దయ!! క్షేమం గా causeway దాటాము . 

మొత్తానికి హైవే ఎక్కాము . ఇంకా వర్షం పడుతోంది .. అయినా ఇక్కడ పడుతున్న  ఈ వర్షం అక్కడ పచ్చని ..సహజ సిద్ధమయిన ప్రకృతి మధ్యలో పడుతున్న వర్షమంత అందంగా లేదు !! నగర జీవితం లా పేలవం గా , artificial గా అనిపించింది !!  అయినా వున్న చోటు , పడే చోటుని బట్టి వర్షం మారుతుందా ??!! నా పిచ్చి కానీ ... !!

కొన్ని ఫోటోలు : 



సశేషం ...